Tuesday, August 27, 2013

ప్రజా సమస్యలన్నీ గాలికి పోయాయి. అప్పుడు ప్రత్యేక తెలంగాణా ఉద్యమం, ఇప్పుడు సమైక్యాంధ్ర ఉద్యమం. వెరసి పరస్పర విద్వేషాలు, కార్పణ్యాలు. నేనెంతటి ఆశాజీవి నైనా అప్పుడప్పుడు నిరాశ, నిస్పృహలు అవహిస్తూ ఉంటాయి. ఆశిస్తున్న మార్పు కొంచెమే అయినా, ప్రజల్లో కొద్దిపాటి ఆలోచన కూడా ఆచరణాత్మకంగా కలగటం లేదేమిటా అని. నేనేమి అద్భుతాలు జరగాలని కోరుకోవటం లేదు. భావోద్వేగాల గుప్పిట్లో సామాన్యులు శలభాల్లా మారి తమ జీవితాల్ని నాశనం చేసుకుంటుంటే రాజకీయ నాయకులు తమ బొజ్జలు పెంచుకుంటూ, వికృత క్రీడలను మహదానందంగా ఆడుతున్నారు. ప్రత్యేక తెలంగాణ వల్ల తెలంగాణలోని సామాన్యుడికి ఒరిగేదేమీ లేదని ఆనాడు చెప్పినా ఎవరూ వినే పరిస్థితి లేక పోయింది. ఈ వేళ రాష్ట్రం విడిపోయినా సీమాంధ్ర లోని సామాన్యుడికి పోయేదేమీ లేదని చెప్పినా వినిపించుకునే వాడు లేదు. కేవలం పరిపాలనా సౌలభ్యం కోసం ప్రజలకు మరింత మెరుగ్గా సేవలందించడం కోసం తీసుకోవలసిన నిర్ణయాలను రాజకీయ పార్టీలు, నాయకులు తమ స్వీయ రాజకీయ ప్రయోజనాల కోసం తీసుకోవడం దారుణం. ప్రజల్లో భావోద్వేగాలను రెచ్చగొట్టి, పొట్టేళ్లలా ప్రజలు కుమ్ముకుంటుంటే కారే రక్తాన్ని వోట్ల రూపంలో ఎలా మార్చుకోవాలా అని రాజకీయ పార్టీలు ప్రణాళికలు వేసుకుంటుంటే దేశం అన్ని రంగాలలోను వైఫల్యాలను చవిచూస్తూ నానాటికి దిగజారి పోతుంటే ఏం చేయాలో అర్ధం కాని పరిస్థితి. ఈ దేశానికి సరైన నాయకత్వాన్ని అందించలేకపోవడం మా తరం దౌర్భాగ్యపు వైఫల్యం.     

No comments: